ఆటో డ్రైవర్ నిజాయితీ…రూ. 2 లక్షల నగదు, బంగారు, వెండి నగలు ఉన్న బ్యాగ్ వృద్ధురాలికి అందజేత
ఉప్పాడ కనకదుర్గ ఆటో యూనియన్కు చెందిన డ్రైవర్ పి. మసేను ఆటోలో బ్యాగ్ను గుర్తించి, డబ్బులు, నగలు ఉన్నాయని గమనించి ఆటో యూనియన్ గ్రూప్లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు ఉప్పాడ చేరుకోగా, యూనియన్ ఆధ్వర్యంలో ఆమెకు బ్యాగ్ను అప్పగించారు.

మానవత్వం ఉన్న మనుషులు ఎప్పుడో ఒక చోట తారస పడుతూనే ఉంటారు. అలాంటి సంఘటనే కాకినాడ జిల్లాలో జరిగింది. వివరాలలోకి వెళితే
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తొండంగి మండలం గొల్లల మామిడాడకు చెందిన వృద్ధురాలు గొర్ల వరలక్ష్మి ఉప్పాడ నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి ఆటోలో ప్రయాణించి, తన వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారు, వెండి నగలు ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయారు.

కొంత దూరం వెళ్లాక ఉప్పాడ కనకదుర్గ ఆటో యూనియన్కు చెందిన డ్రైవర్ పి. మసేను ఆటోలో ఉన్న బ్యాగ్ను గుర్తించి తెరిచి చూడగా దానిలో డబ్బులు, నగలు ఉన్నాయని గమనించి ఆటో యూనియన్ గ్రూప్లో సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న బాధితురాలు ఉప్పాడ చేరుకోగా యూనియన్ ఆధ్వర్యంలో ఆమెకు బ్యాగ్ను అప్పగించారు.
ఆటో డ్రైవర్ నిజాయితీని పలువురు అభినందించారు.



