బడ్జెట్లో ‘మహాలక్ష్మి’కి మోక్షం? పెన్షన్ల పెంపుపైనా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…!
18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ నెలకు ₹2,500 నేరుగా ఖాతాల్లోకి

తెలంగాణలోని పేద, మధ్యతరగతి వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తోంది. సోమవారం (మార్చి 16) ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక హామీల అమలుకు కసరత్తు చేస్తోంది.
ముఖ్యంగా మహిళలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహాలక్ష్మి పథకం (నెలకు ₹2,500 సాయం) మరియు ఆసరా పెన్షన్ల పెంపు (₹4,000కు) పై ఈ బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే సూచనలు ఉన్నాయి.
రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ వంటివి అమలులోకి రాగా.. పెండింగ్లో ఉన్న ₹2,500 ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపుపై ఆర్థిక శాఖ ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం.



