ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఎల్లో మీడియా.. సీఎం వైఎస్ జగన్

గుంటూరు: ఎల్లో మీడియా తనపై తప్పుడు వార్తలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాను నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని, గంటపాటు చర్చించానని చెప్పారు. తనకు నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు ఎల్లో మీడియా ఓ వార్త ప్రచురించిందని గుర్తు చేశారు. గదిలో తాను, నరేంద్ర మోదీ మాత్రమే ఉన్నారని, సమావేశంలో ఏం చర్చించారో ఎల్లో మీడియాకు ఎలా తెలుసని అన్నారు.
ఎల్లో మీడియా మీటింగ్ రూమ్ లో సోఫా కింద కూర్చుందా అని ప్రశ్నించారు. గురువారం నరసరావుపేటలో స్వచ్ఛంద సేవకులను సన్మానించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఈర్ష్య వల్లే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈర్ష్య ఆరోగ్యానికి మంచిది కాదని, వారికి హైబీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని, రామాయణంలోని మారీచ లాంటి రాక్షసులతో పోరాడుతున్నానని అన్నారు.
ఎల్లో మీడియా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుకు, దత్తపుత్రుడికి మద్దతు ఇస్తుందని, ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు ఎజెండా ఒక్కటేనని విమర్శించారు. తనపై ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని, ఎన్నికల హామీలు అమలు చేయకపోతే రాష్ట్రం అమెరికా అవుతుందా? సంక్షేమ పథకాలు కొనసాగిస్తే అధికారంలోకి రాలేమని చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియా ఆందోళన చేస్తున్నాయని, అందుకే ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.