గోల్ఫ్ లో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న గురుకుల విద్యార్థిని

-గోల్ఫ్ లో సత్తా చాటిన గురుకుల విద్యార్థిని
– జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ కైవసం
మహబూబాబాద్ తొర్రూర్ మార్చ్ 25(నిజం న్యూస్)
ఆసక్తి ఉన్న రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని 13ఏళ్ల అమూల్య నిరూపిస్తోంది.
ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు గోల్ప్ క్రీడాంశంలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది.
ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్ లో తొర్రూరు బాలికల గురుకుల విద్యార్థిని గుగులోతు అమూల్య అదరగొట్టింది.
ఈ నెల 24న కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ జాతీయ గోల్ప్ పోటీల్లో తొర్రూరు బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని బి. అమూల్య గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాద్ నార్సింగి లోని సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ పాఠశాలలో తర్ఫీదు పొందిన అమూల్య ఉత్తమ ప్రదర్శన కనబరిచి పసిడిని ముద్దాడింది. 76 పాయింట్లతో అమూల్య అంచనాలకు మించి ప్రదర్శన చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. దాంతోపాటు ఈనెల 21 నుంచి 23 వరకు కర్ణాటక రాష్ట్రంలోని బంగాది పేట లో నిర్వహించిన జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి రూ.25 విలువచేసే గోల్ప్ కిట్, రూ.10 వేల నగదు బహుమతి కి అర్హత సాధించింది.
అమూల్య తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు పతకాలు సాధించారు.
తొర్రూరు మండలం శివారు ఎర్ర సోమ్లా తండా అమూల్య స్వస్థలం. గురుకుల విద్యార్థిని ఉత్తమ ప్రదర్శన పట్ల ప్రిన్సిపాల్ జి. జయశ్రీ, పీఈటీలు కుసుమ, రజినిలు సంతృప్తి వ్యక్తం చేశారు.
గురుకుల ఆర్ సి ఓ ప్రత్యూష ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడుతూ… గోల్ఫ్ సౌత్ జోన్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అమూల్య కు గొప్ప భవిష్యత్తు ఉందన్నారు. చదువుతోపాటు ఉ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ఆహ్వానించదగింద న్నారు. ధనవంతులకు క్రీడగా పేరొందిన గోల్ప్ లో పేదింటి బిడ్డలు రాణించడం గర్వకారణం.