ప్రసూతి ఆసుపత్రికి అనారోగ్యం !
ఆసుపత్రికి అనారోగ్యం!
పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ప్రభుత్వాసుపత్రి కనీస వసతులు లేక అనారోగ్య వాతావరణంలో కొట్టుమిట్టాడుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ప్రసూతి కేంద్రం రోగులకు కనీస సౌకర్యాలు అందించలేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. తుప్పు పట్టిన మంచాలు, తిరగని ఫ్యాన్లు, ఆసుపత్రి ఆవరణలో వెలగని లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఆసుపత్రిలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది.
ఇలాంటి వాతావరణంలో ఉన్న ఆసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం లేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురై పట్టించుకునే నాధుడే లేక మూలన పడి ఉంది.
గతంలో ఈ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చమని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు ఆసుపత్రికి అన్ని సౌకర్యాలు అందిస్తామన్న ఉన్నతాధికారులు డిప్యుటేషన్ పద్ధతిలో అరకొర సిబ్బందిని నియమించి చేతులు దులుపుకున్నారు. ప్రసూతి కేంద్రం లో పిల్లల డాక్టర్ను ఏర్పాటు చేయడం మరిచారు.ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ పోస్టులు తప్ప మిగిలిన వారందరూ డిప్యూటేషన్ పద్ధతిలో వచ్చిన వారే అవటం వల్ల వారి స్థానాలకు వారు వెళ్తారని అప్పుడు తమగతేంటి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఒక స్టాప్ నర్స్ ను సిమాంగ్ సెంటర్కు నియమించారని ప్రజలు ఆనందించే లోపు ఉన్న డాక్టర్ను దుమ్ముగూడెం మండలం బండిరేవు పంపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంద సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన ఆసుపత్రికి కనీస సౌకర్యాలు కల్పించమని ప్రజలు కోరుతున్నారు.