Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పందెం కోళ్లను ఆపగలమా? 

ఏటా సంక్రాంతి పండగకు ముందు కోడిపందాలపై వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళనాట జల్లికట్టు… మనదగ్గర కోడిపందాలు వివాదం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ యేడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలకు అడ్డుకట్ట వేయాల్సిందే అన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే కరోనా పరిస్థితులు మళ్లీ తీవ్రంగా ఉన్నాయి. కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలో కోరోనా కేసులు లక్షకు చేరుకున్నాయి. థర్డ్‌వేవ్‌ ముప్పుతో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనలు ఒకవైపు..పండగలను సరదా చేయాల్సిందే అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.

సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహించరాదని హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ..అసలు పందేలు ఉంటాయా ఉండవా అన్న సందేహం మరోమారు తెరపైకి వచ్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, వాడపల్లి, తోగుమ్మి, మద్దూరు ఇతర గ్రామాల్లో కోడిపందేలా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ఆ గ్రామాలకు చెందిన పసలపూడి సుభాష్‌ చంద్రబోస్‌, బిక్కిన వెంకట దుర్గాప్రసాద్‌ దాఖలుచేసిన వ్యాజ్యా లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అయితే కోనసీమ వాసులను ఎవరిని అడిగినా కోడిపందెం లేనిదే సంక్రాంతి లేదంటారు. కోడిపందాల మజా అంటేనే పండగ అంటారు.

తమిళనాడు వాసులకు జల్లికట్టు కూడా అలాంటిదే. గతంలో జల్లికట్టుకు సంబంధించి ఎంత రాద్దాంతం జరిగిందో ప్రజలు మరచి పోయి ఉండరు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ విషయమై ఏటా ఎవరో ఒకరు కోర్టుకు పోవడం దానిపై ఉత్తర్వులు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది హైకోర్టు ఉత్తర్వులు ఎలా ఉంటాయో అన్నది ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.

ఏటా కోడి పందేలు ఒక మెగా ఈవెంట్‌ లా మారిపోతున్నాయి. పందేలు నిర్వహిస్తున్న ప్రాంగణం అంతా బస్సులు, కార్లతో నిండిపోవడం చూస్తే, ఎంత పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఏటా జరుగు తున్న తంతును గమనిస్తే పెద్ద ఎత్తున కోడిపందాలను  నిర్వహిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై అధికారులు దాడులు చేయడం కూడా ఏటా పరిపాటి వ్యవహారంగానే సాగు తోంది. కోడిపందేల నిర్వహణ కుదరదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గతంలో ఎంపి రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏటా ఆయన సుప్రీంకు వెళ్లడం తాత్కాలిక ఆదేశాలు తెచ్చుకోవడం, ఏటా పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

బరులు లేకుండా కత్తి కట్టకుండా పందాలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని గతంలో ఆదేశాలు కూడా వచ్చాయి. ఇదంతా మామూలే అన్న ధరోణిలో ఛోటామోటా నేతలు ఉన్నారు. అందుకే సంక్రాంతి కోడి కోసం ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఎవరికి వారు సర్దుకు చెప్పుకుని పందెం కోళ్లను రెడీ చేస్తున్నారు. అందుకే సంక్రాంతి పందెం కోడి కూయబోతోంది.

ఈ ఏడాది కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం సంక్రాంతికి జరుగుతున్న కోడి పందేలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముందస్తు అరెస్టులు చేస్తామని అంటున్నారు. పందాలు నిర్వహించవద్దంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు కోడి పందేల నిర్వాహకులు మాత్రం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ వీటి నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని నిర్వాహకులు పైరవీలు ప్రారంభించారు. సంక్రాంతి పండగ సందర్భగా జరిగే కోడిపందాలకు పశ్చిమ పెట్టింది పేరు. ఇక్కడ ఎన్ని అవాంతరాలు ఉన్నా పందాలు జరిగి తీరాల్సిందే అన్న రీతిలో సాగుతున్నారు.

కోర్టు ఆంక్షలు ఉన్నా, పోలీసుల నిఘా పెరిగినా బరులు సిద్ధమవుతున్నా యి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బరులను సిద్ధం చేస్తున్నారు. ఓ పక్క పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా.. మరోపక్క నిర్వాహ కులు బహిరంగం గానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి మూడు రోజులు 13 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో లాడ్జిలు నిండిపోతాయి.

గతేడాది కోడి పందాలు నిలువరిం చేందుకు భోగి పండుగ రోజు పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా చివరకు రాజకీయ నాయకుల ప్రభావం ముందు నిలవలేక చేతులెత్తేశారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతుందనే ప్రయత్నాల్లో పందెంరాయుళ్లు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా కోళ్లను పెంచి వాటికి ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు.

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే ప్రాంతాల్లో కోడి పందేలు లేకపోతే పండగ సరదా ఏముందన్న వాదన ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా భోగి రోజు మాత్రం కోడికి కత్తి కట్టాల్సిందే. ఆంక్షల నేపథ్యంలో రహస్యంగా బరికట్టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చే పందేగాళ్లకు తగిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఆయాచోట్ల బరులను లోపాయకారిగా సిద్ధం చేస్తున్నారు.

ఆరగట్టిన చేపల చెరువులను పందేలకు వేదికలుగా మార్చు కోవాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పందేలు నిర్వహణకు కొందరు ఇప్పటి నుంచి సిండికేట్‌గా ఏర్పడి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కోడిపందేల సంస్కృతికి ఉన్న ప్రాంతాల్లో సంప్రదాయం మాటున పందేలును జూదంగా మార్చి లక్షలు వెనుకేసుకునేందుకు మంతనాలు సాగుతు న్నాయి.

రాజకీయ నేతల అండదండలతో నియోజకవర్గం వ్యాప్తంగా మండలాల్లోని పలు గ్రామాల్లో కోడిపందేలు ఆడిరచేందుకు స్థానిక నాయకులు వేగంగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి. కోడిపందేలాను ఆపుతారా లేదా అన్నది చివరి నిముషం వరకు తేల్చరు. దీంతో ఏటా యధావిధిగానే ఎవరికి వారు బరులకు సిద్దం కావడం కూడా పరిపాటిగా మారింది. కరోనా కూడా మరో వారం రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం.