Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమ్మ లొంగలేదని అమ్మాయి ప్రాణం తీశాడు..!

?అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న నాటు వైద్యుడు…..

?కూతుర్ని వైద్యానికి తీసుకొచ్చిన తల్లి

?కోరిక తీరిస్తేనే చికిత్స చేస్తానని వేధింపు

?తల్లి నిరాకరణతో కూతురికి పసరు పోసి ప్రాణం తీశాడు…!

అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యం తో బాధపడుతుండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు.

అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు.

కోరిక తీర్చనందుకే…..

భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా..వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది.

విషయం తెలుసుకున్న దురాజ్‌పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. భిక్షపతిని రూరల్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్‌ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు.