మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే… రాహుల్ ద్రవిడ్
ఒకే ఆటగాడు అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
ముంబై,నవంబర్15(ఆర్ఎన్ఏ): మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే. భవిష్యత్తులో జరుగనున్న ఐసీసీ టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టామన్నారు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. న్యూజిలాండ్తో బుధవారం (నవంబర్ 17) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ముందు.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల్లో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తాం. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాణించాలంటే ప్రతి ఒక్క ఆటగాడు ఫ్రెష్గా ఉండటం చాలా ముఖ్యం. కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికేలా చూస్తా. ఒకే ఆటగాడు అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. అందుకే జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లను తయారు చేసుకుంటాం’ అని అన్నాడు. ‘ఒకరిద్దరిపైనే ఆధారపడితే విజయాలు సాధించలేం. అందుకే, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను మలుచుకుంటాం. ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తా. మీరు బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తాం. మా టీమ్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకోవడం ప్రస్తుతం మా ముందున్న అతి పెద్ద సవాల్. అలా అని ఇతర జట్ల వ్యూహాలను మేం అనుసరించం. మాకు ఏది సరిపోతుందో ఆ మార్గాన్నే అనుసరిస్తాం. ప్రతి ఆటగాడు మాకు ముఖ్యమే. అందుకే, వారిపై పని భారం పడకుండా చూస్తాం. మా జట్టులో కోహ్లి చాలా కీలక ఆటగాడు. జట్టు అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటాం’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగనుంది.