దీపావళి కానుకగా 5న ఆచార్యలో మరోపాట విడుదల

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ’ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే మరో పవర్ ఫుల్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికరమైన కథతో సందేశాత్మక రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల. ఇటీవలే సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇంతకు ముందు ’ఆచార్య’ సినిమాకి సంబంధించిన టీజర్, ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ఉదయం రామ్ చరణ్, ఆయన సరసన కథానాయికగా నటిస్తోన్న పూజా హెగ్డే లపై చిత్రీకరించిన ’నీలాంబరి’ అనే పాట ను సెకండ్ సింగిల్ గా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు మేకర్స్. మణిశర్మ సంగీతం అందించిన ఈ మెలోడియస్ డ్యూయెట్ సాంగ్ పై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. పీరియాడికల్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట మనల్ని ఆ కాలంలోకి తీసుకెళుతుందని తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ’ఆచార్య’ సినిమా మెగాభిమానులకు మాస్ ఫీస్ట్ అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ’సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో ’ఆచార్య’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి