ఎపి జెన్ కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండు గత సంవత్సరం నుండి కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రిడ్ అవసరాలు సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది.
బొగ్గు తడిగా ఉన్నందున పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఏపీ జెన్కో ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు.
ఈ నేపధ్యంలో విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) సంస్థ అధ్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది.
ఈ ఆర్ధిక సంవత్సరం లో జెన్ కో పనితీరు అనూహ్యంగా మెరుగయ్యింది. తత్ఫలితంగా ఆంధ్రదేశమంతటా వెలుగుల జల్లులు ప్రసరిస్తున్నాయి.
గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా… ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో థర్మల్ యూనిట్లు పదివేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది.
అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది కేవలం నాలుగున్నర స్వల్ప సమయంలో రెండువేల ఎనిమిది వందల మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి చేయడం జెన్కో థర్మల్ యూనిట్ల ఉత్తమ పనితీరుకు నిదర్శనం.
అంతేకాకుండా రిజర్వేషన్ల అమలు, ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ) పనితీరు అద్భుతంగా ఉందని మాజీ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు డాక్టర్ అంజుబాల గత నెలలో ప్రశంసించారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రభాగంలో ఉందని, విశాఖలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రాష్ట్రంలో రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో పెట్టేందుకు వివిధ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5,338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్కో స్పష్తం చేసింది.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తోంది కాగా కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదు.
ఈ పవర్ ప్రోజెక్ట్ నిర్మాణం పూర్తయితే మరొక 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చి విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర ప్రదేశ్ నిలుస్తుంది.
(కథనం: ప్రతాప్)