గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు అస్వస్థత
విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో పాఠశాల ప్రిన్సిపాల్… కనీసం తల్లిదండ్రులకు తెలియజేయలేదని విద్యార్థుల ఆందోళన.
రెండు రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అందని వైద్యం… స్థానిక ప్రజా ప్రతినిధులు జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలి.
తుంగతుర్తి : జులై 24, నిజం చెపుతాం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినీలకు సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినిలను పాఠశాలలో ఏ ఎన్ ఎం లేకపోవడంతో ఒక టీచర్ సాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
ఈ మేరకు డాక్టర్ మమత విద్యార్థులను పరిశీలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ… తమకు రెండు రోజులుగా కడుపులో నొప్పి, జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నామని, తగ్గకపోవడంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు.
డాక్టర్ మమత మాట్లాడుతూ.. పాఠశాలలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థినీలు జ్వరం, విరోచనాలకు గురైనట్లు నీళ్లు, ఆహారం వల్ల అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. పిల్లలకు సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
కనీసం రెండు రోజులుగా అస్వస్థత గురవుతుంటే పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని విద్యార్థినీలు వాపోయారు. ఇప్పటికైనా ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణి వీడి పిల్లలకు నాణ్యమైన భోజనంతోపాటు మినరల్ వాటర్ ను అందించాలని గురుకుల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
పేద గిరిజన విద్యార్థినిల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ దుర్గ భవాని పై శాఖ పరమైన , చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు..