Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులను ఆకర్షిస్తున్న మెట్ట వరి సేద్యం

మెట్ట వరి సాగు పై దృష్టి సారిస్తున్న పెన్ పహాడ్ మండలం నాగుల పహాడ్ (దుబ్బగుడెం) రైతులు

50 ఎకరాల లో మెట్ట వరి సాగు చేసిన గ్రామ రైతులు

పెన్ పహాడ్ మండలం లో తొలిసారిగా నూతన పద్ధతిలో వరిసాగుకు పెన్ పహాడ్ మండలం నాగులపహడ్ గ్రామం వేదికయింది.

సూర్యాపేట జిల్లా లో తొలిసారిగా నూతన పద్ధతిలో వరిసాగుకు ఆ గ్రామం వేదికయింది. ప్రయోగాత్మకంగా గత ఏడాది పలువురు రైతులు చేపట్టిన మెట్ట వరి సాగు విధానం విజయవంతమయ్యింది. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఈ విదానం రైతులను అమితంగా ఆకర్షించింది.

దీంతో పెన్ పహాడ్ మండలం నాగుల పహాడ్,దుబ్బగుడెం రైతులు పెద్ద ఎత్తున మెట్ట పద్ధతిలో వరి సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో మెట్టవరి సాగు ప్రారంభమైంది.

ఎరువులు, నీటి వాడకం తగ్గడం, అదే సమయంలో దిగుబడి పెరగడంతో కర్షకులు ఈ సాగు వైపు మక్కువ చూపుతున్నారు.

గ్రామం లో కౌలు రైతు అయిన సంకర మద్ధి నాగిరెడ్డి , రైతులు ఇసుకపల్లి రమణయ్య, సంకరమద్ధి పుల్లా రెడ్డి, కిరణ్ రెడ్డి, నారాయణ దేశం రెడ్డి లు ఇప్పటికే 50ఎకరాల్లో మెట్ట వరి సాగు చేస్తుండగా, వీరి ని అనుసరించేందుకు గ్రామం లో చాలా మంది రైతులు సన్నద్ధం అవుతున్నారు.

సంప్రదాయకంగా వరిని సాగుచేయాలంటే నారుపోసి, మడుల్లో నీటిని నింపి దమ్ము చేసిన తర్వాత బురద నీటిలో నాట్లు వేయ్యాలి. ఇందుకు నీటి వినియోగంతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువే అవుతుంది.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవేవి లేకుండా సాగులో నీటి వినియోగాన్ని, పెట్టబడి ఖర్చులను తగ్గిస్తూ పర్యావరణ హితంగా మెట్ట పద్దతిలో వరి సాగును డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ వాతావరణ విభాగం ప్రయోగాత్మకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమలు చేస్తోంది.

ఈ పద్దతిలో ట్రాక్టర్ వెనకాల మల్టీ క్రాప్ ప్లాంటర్ పరికరాన్ని భిగించి భూమిలో విత్తనాలు వేసి వరిని సాగు చేస్తారు. గత వానాకాలం సీజన్ లో త్రిపురారం మండలంలో 380 ఎకరాల్లో ఈ పద్దతిలో వరిసాగు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలోని 12 మండలాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో మెట్ట పద్దతిలో వరి సాగు జరుగనుంది.

పిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్ధ , ఇరి శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ ఈ నూతన విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది.

సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల దిగుబడి పెరగడంతో ఈ ఏడాది చాలా మంది రైతులు ఈ విధానంలో సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. నాలుగైదేళ్లలో రాష్ట్రం మొత్తం ఈ విధానంలోనే రైతులు వరిసాగు చేసేలా కార్యచరణ రూపొందిస్తోంది.

జిల్లా లో ఇప్పటికే మెట్టవరి సాగు చేసేందుకు 2400 మంది రైతులు ముందుకు వచ్చారు. రైతులు, సాగు విస్తీర్ణం పెరగడంతో 48 మిషన్లు తెప్పించి రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు నాటే పరికరంతో గంటలో ఓ ఎకరం చొప్పున విత్తనాలు వెయ్యవచ్చు.

Also read: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

యంత్రానికి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్‌ ఎకరానికి వెయ్యి రూపాయిలు మాత్రమే రైతు నుంచి తీసుకుంటాడు. రైతుకు కొత్త టెక్నాలజీ దగ్గర చేయడం, మిథేన్ గ్యాస్ విడుదలను తగ్గించడం, వాతావరణాన్ని రక్షించడం, పంటల దిగుబడి పెంచాలన్న ఉద్దేశంతోనే కృషి చేస్తున్నామని రెడ్డీస్ సంస్థ ప్రతినిది సలీం చెబుతున్నారు.

పంట వేసిన దగ్గర నుంచి కోసే వరకు రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తూ అన్నదాతలను ముందుకు తీసుకెళ్తామంటున్నారు.