Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె

పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరు ల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. పండుగ వాతావరణంలో జరుపాలని సీఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.

 

గురువారం డా. బిర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సీఎం వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి సీఎం వివరించారు. అదే సందర్భంలో… గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సీఎం ప్రకటించారు.

 

దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా.. ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సీఎం రంగాల వారిగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయారోజు చేపట్టే శాఖలు అవిసాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సీఎం అర్థం చేయించారు.

 

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు.

 

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సీఎం సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

 

పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సీఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను అధికారులను సీఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.

 

కాగా సీఎం ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు తాము ఈ మూడు వారాలు కృషిచేస్తామని కలెక్టర్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటి పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో వున్నది. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులుగా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. వొక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. వొకనాడు గంజికేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ ను దాటేసి పోతున్నం.’’ అని

సీఎం వివరించారు

తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగామని సీఎం అన్నారు. నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. కాగా నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.

వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాథ కార్తెలో:

గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రథమ ప్రాధామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్టు వ్యవస్థలయిన చెరువులు విద్యుత్తు సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు.

తత్ఫలితమే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి’’ అని సిఎం అన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు చేపట్టాలని సిఎం అన్నారు.

ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టం రైతుకు కలిగిన కష్టాలను గుణపాఘంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని సిఎం అన్నారు.

‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’

‘‘ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో వుంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది.

Also read: ఢిల్లీ సైకో కిల్లర్ రవీంద్రకుమార్ కు జీవిత ఖైదు

ఈ నేపథ్యంలో.. మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వలన కోతలు కూడా లేటయితున్నయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది.

ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15-20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి వుంటది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి వుంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది.’’ అని సిఎం అన్నారు.

కాగా… యాసంగి లో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అదివాస్తవం కాదని సిఎం అన్నారు. ‘‘వరి తూకం పోసే టప్పుడు కాదు.

వరి ఈనే సమయంలో చలి వుండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగవుండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా.. ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె..’’ అని సిఎం వివరించారు.

యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… ‘‘తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది’’ అని సిఎం రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా… ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సిఎం ఆదేశాలమేరకు ఆశాఖ మంత్రి సింగిరెడ్డ నిరంజన్ రెడ్డి సమావేశంలో వివరించారు.

21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి బధ్రపరచాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు.

అదే సందర్భంలో నియోజకవర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే .. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు.

ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సిఎం ఆదేశించారు.