జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ:
జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులతోను క్రోడికరించి రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబందు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు.
Also read: ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా వరి తప్ప మరేదైనా…
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.
ఇండ్ల స్థలాల పంపిణీ:
ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.
జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం:
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు.
నిమ్స్ దవఖాన నూతన భవనానికి శంఖుస్థాపన:
జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.