క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి…
మంచిర్యాల జిల్లా ప్రతినిది ఏప్రిల్ 27 (నిజం న్యూస్)
-అధికారుల ధన దాహానికి అంతరించిపోతున్న ఆనవాళ్లు…
-చూసి చూడనట్లు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం …
మంచిర్యాల కాంట్రాక్టర్ల ధన దాహానికి గుట్ట కరిగిపోతోంది. అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకు పోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు అధికార పార్టీకి చెందిన బడా నేతల మద్దతు ఉండటంతో మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించడంతో సరిపెడుతున్నారు. మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో ఈ నిర్వాకం బహిరంగంగా జరు గుతోంది. గతంలో తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ఇటీవల ప్రత్యేక పంచాయతీగా మార్చారు.
గ్రామాన్ని ఆనుకొని ‘బొక్కలగుట్ట’ అనే కొండ ఉండటంతో అదే పేరును ఊరికి సార్థకం చేసినట్లు గ్రామస్తులు చెబుతారు. ప్రకృతికి అద్దం పట్టినట్లు పచ్చని చెట్లతో విరాజిల్లుతూ ఊరికే అందం తెచ్చి పెట్టిన ‘గుట్ట’ ప్రస్తుతం కాంట్రాక్టర్ల ధన దాహానికి కనుమరుగవుతోంది.
అనుమతులు లేకున్నా మట్టి తవ్వకాలు
బొక్కల గుట్టలో మట్టి తవ్వకాలకు సంబంధించి గనులు భూగర్భ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ అక్రమంగా లక్షలు గడిస్తున్నారు.
ALSO READ: సైకిల్ పై కాశీ యాత్ర చేసిన పల్లెపహాడ్ వాసి
మట్టి తవ్వకాలకు నిబంధనల మేరకు ఒక్కో క్యూబిక్ మీటర్కు రూ.75 అడ్వాన్స్ రాయల్టీ, 30 శాతం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్టీ), 2 శాతం స్టేట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్టు(ఎస్ఎంఈటీ) ఫీజులతోపాటు 2 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మట్టి తవ్వకాలు జరిపే సమయంలో ప్రతిసారీ మళ్లీ పర్మిట్లు తీసుకోవలసి ఉంటుంది. ఇవేమీ చెల్లించకుండానే రోజు దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకు పోతున్నట్ల్లు సమాచారం. గుట్ట నుంచి తవ్విన మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్న సదరు కాంట్రాక్టరు (అనధికార) కోట్లు గడిస్తుండగా, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతోంది.
కాంట్రాక్టరు మట్టితోపాటు పర్మిట్లు లేకుండా గుట్టలో రాయి తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నాడు. గుట్ట నుంచి గృహ అవసరాల కోసం రాయిని తవ్వేందుకు తిమ్మాపూర్ శివారు 139 సర్వే నెంబర్లో మోహన్, సుధాకర్ అనే ఇద్దరు 1.10 ఎకరాలు, 2 ఎకరాల చొప్పున లీజుకు ఇస్తూ మైనింగ్ శాఖ పర్మిట్లు జారీ చేసింది.
సదరు కాంట్రాక్టర్లు తమ హద్దులు దాటి తవ్వకాలు జరుపు తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా తమకున్న పరిధి దాటి తవ్వకాలు జరిపినందున మైనింగ్శాఖ అధికారులు ఈ నెల 24న జరిమానాలు విధించారు.
రాయల్టీ చెల్లించకుండా తవ్వకాలు జరిపిన క్వారీ నిర్వాహకులు తిమ్మాపూర్నకు చెందిన భీమ సుధాకర్కు రూ. 1.46 కోట్లు, పులిమడుగు గ్రామానికి చెందిన భుక్య మోహన్కు రూ.1.62 కోట్లు జరిమానా విధించడం గమనార్హం. అయినా లీజుదారుల్లో మార్పులు రాకపోవడం విశేషం.
నిఘా వ్యవస్థ నిర్వీర్యం
గుట్టలు, ఇతర ప్రభుత్వ భూముల నుంచి రాళ్లు, మట్టి తవ్వకాలపై నిఘా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీఎస్, ఈటీఎస్ అనే డిజిటల్ సర్వే బాధ్యతలను మహారాష్ట్రలోని నాగపూర్నకు చెందిన ఓ ఏజెన్సీకి అప్పగించింది.
ఆయా స్థలాల్లో జరుగుతున్న తవ్వకాలపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు శాటిలైట్తో నిఘావేసి అధికారులను అప్రమత్తం చేయాలి. నిబంధనల మేరకు తవ్వకాలు జరుగుతున్నాయో సర్వే జరిపి మైనింగ్ శాఖ అధికారులకు రిపోర్టు చేయాలి. ఆయా సంస్థలు ఎలాంటి సర్వే జరుపకపోవడంతో గుట్టలో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది.
జరిమానాలు విధిస్తున్నాం…
రమావత్ బాలు, మైనింగ్శాఖ జిల్లా ఏడీ
బొక్కల గుట్టలో మట్టి తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. రాయి తవ్వకాలకు అనుమతులున్న కాంట్రాక్టర్లు సైతం తమ పరిధిలోనే తవ్వకాలు జరపాలి. గుట్ట నుంచి రాయి, మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో తనిఖీ చేపట్టాం. అక్రమంగా మట్టి తరలిస్తున్న కాంట్రాక్టర్కు ఇప్పటికే పెద్ద మొత్తంలో జరిమానా విధించాం. వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించాం.