2023 ఎన్నికల్లో బీజేపీయే తన ప్రత్యర్థి…
బిజెపిని అడ్డుకోవడమే బిఆర్ఎస్ ఎజెండా
స్థానిక సమస్యల ఆధారాంగా పోరుబాట
కేంద్రాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా విమర్శలు
హైదరాబాద్,ఏప్రిల్21: రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల బిఆర్ఎస్ను భయపెడుతోందా… అంటే ఔననే అనిపిస్తోంది. అసెంబ్లీలో 1గా ఉన్న వారి సంఖ్య 3కు చేరింది. బిఆర్ఎస్ స్వయంకృతం కూడా కొంత ఉంది. ఎంతసేపు కేంద్రాన్ని తిట్టిపోస్తున్న కెసిఆర్ సర్కార్..రాష్ట్రంలో సమస్యలను తక్కువ చేసి చూపుతు న్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీలో అసలు దోషులను పట్టుకోలేదు. ఈ విషయంలో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోంది. రాజకీయంగా బిజెపిని ఎదుర్కొనే క్రమంలో మంత్రులు మాట్లాడుతున్న భాష మారుతోంది. విమర్శలకు పదను పెట్టడంలో తప్పు లేదు కానీ వాడు..వీడు అంటూ సంబోధిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
బిజెపికి వ్యతిరేకంగా తీసుకున్న టర్న్ కారణంగా రాజకీయ కోణం ఉండొచ్చు. కానీ సరైన భాష వాడకుండా చేస్తున్న విమర్శలతో ముందుగా నష్టపోయేది బిఆర్ఎస్ మాత్రమే అని ఆ పార్టీ అధినేత గుర్తించడం లేదు. మంత్రి కెటిఆర్ కూడా వాడూవీడూ అంటూ సంబోధిం చడం సరికాదు.
ALSO READ: కార్పోరేట్లపై ఉన్న ప్రేమ రైతులపై ఏదీ
కేంద్రంపై పోరాటం చేయడానికి సమస్యలు వేరుగా ఉండాలి. సమస్యతో యుద్దం చేయడం వల్ల లాభం ఉంటుందా లేదా అన్నది చూడాలి. నిజానికి ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ ఓ రకంగా బిజెపికి అంటకాగుతూ వచ్చింది. ప్రధాని మోడీ తీసుకున్న అనేక నిర్ణయాలకు తలూపింది.
మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్ఎస్ మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. కాబట్టి కేంద్రంతో టీఆర్ఎస్ విధానం లోపాయకారిగా అనుకూలంగా నడిచిందన్న ఆరోపణలు వచ్చాయి.
మోడీ కనుసన్నల్లో కేసీఆర్ నడుస్తున్నారనే భావన కలిగించింది. ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడిరది. ఐతే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి తరువాత బీజేపీ పట్ల టీఆర్ఎస్ తప్పనిసరి పరిస్థితిలో తన విధానం మార్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు దానిని సూచిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్గా మారాక చివరకు ఎదరుదాడికి దిగే పరిస్థితి తెచ్చుకోవడం వెనక బిజెపి బలపడకుండా చూడాలన్న లక్ష్యం తప్ప మరోటి కాదు. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బిజెపి పుంజుకుంది. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్ఎస్లో గుబులు రేపింది.
ALSO READ: రాష్టాల్ర ఖజానాను దెబ్బతీస్తున్న ఉచితాలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి కేసీఆర్కు పెద్ద షాక్ అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్ ఆందోళనకు కారణం కావచ్చు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు బిఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది.
బీజేపీ పట్ల తొలినాళ్లలో టిఆర్ఎస్ తటస్థ వైఖరిని అనుసరించింది. చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధించింది. బిల్లలుకు మద్దతిచ్చింది. లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప ఏనాడూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. మోడీ సర్కార్ని విమర్శించటం పెద్దగా చేయలేదు.
ఎన్నికల వేళ మాత్రమే పరస్పర విమర్శలకు పదను పెట్టాయి. ఎన్నికల తరువాత మళ్లీ షరా మామూలే అన్నట్లుగా ఇంతకాలం చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఇకపోతే మారిన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పద సాగు చట్టాలు, లఖింపూర్ ఖేరీ దుర్ఘటన, విద్యుత్ సంస్కరణలు, పెరుగుతున్న ఇంధన ధరలు, చైనా దురాక్రమణతో పాటు ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు.
పార్టీ ఇప్పటి వరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలి పెట్టింది. బిఆర్ఎస్గా పేరు మార్చుకుని జాతీయ రాకీయాల్లో మోడీకి సవాల్ విసురుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా తమ దాడిని తీవ్రం చేసారు. ఈ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు.
మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు ఆదానీ వ్యవహారంలో గట్టిగానే పోరాడారు. ఈ పరిణామాలను బీజేపీ మరోలా తీసుకుంటోంది. 2023 ఎన్నికల్లో బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్ డిసైడ్ అయ్యారని ప్రచారం చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. ఐతే, బీజేపీకి ధీటుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని సృష్టించే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలు తృతీయ ఫ్రంట్కు దారితీస్తాయా లేదా అన్నది చూడాలి.