జగన్ ఆదర్శంగా ఎమ్మెల్యే ఆళ్ల దోపిడీ

యధేచ్చగా మైనింగ్ మాఫియా కార్యక్రమాలు
ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై చర్య తీసుకోవాలి
గొర్రెల కాపరులకు అండగా ఉంటామని లోకేశ్ హావిూ
దేవనకొండలో కొనసాగిన యువగళం యాత్ర
కర్నూలు,ఏప్రిల్18(ఆర్ఎన్ఎ): సహజ వనరుల దోపిడీలో సీఎం జగన్ రెడ్డిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
ముఖ్యమంత్రి ఇంటికి కూత వేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుందన్నారు. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం కర్నూలు జిల్లాలోని దేవనకొండలో యువగళం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండ ను మింగేశారని అన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండపై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని నారా లోకేష్ అభినందించారు. ఇదిలావుంటే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.
ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రకు తరలివస్తున్నారు. యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్కు మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలను ప్రజలు లోకేష్కు వివరిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు తీర్చుతామంటూ లోకేష్ పాదయాత్రలో హావిూలు ఇస్తున్నారు. మంగళవారం ఉదయం పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి 74వ రోజు యువగళం పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ను పరిశీలించారు.
రైతు నాగమ్మ, భర్త కృష్ణన్న గౌడ్తో మాట్లాడి గొర్రెల పెంపకంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నామని, షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యిందని తెలిపారు.
ALSO READ: మార్గదర్శి డిపాజిట్లు బయటపెట్టాల్సిందే..సుప్రీకోర్టు
మొదటి ఏడాది 50 గొర్రెలతో ఫామ్ ప్రారంభించామని చెప్పారు. రెండేళ్లలో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నామని మహిళా రైతు తెలిపారు. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుందని అన్నారు. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుందని వాపోయారు.
ప్రభుత్వం నుంచి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదు అంటూ మహిళా రైతు నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు. మహిళా రైతు సమస్యలు విన్న లోకేష్ వారికి అభయమిచ్చారు.
అధైర్య పడొద్దు అంటూ నాగమ్మకు ధైర్యం చెప్పారు. అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్టాన్రికి ఎంత ప్రమాదమో కల్లారా చూస్తున్నానన్నారు. గొర్రెల పెంపకం కోసం టీడీపీ పాలనలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించామని… మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీ ధరకి అందించామని గుర్తుచేశారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నారు. టీడీపీ హయాంలో షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందించామని తెలిపారు. ఉపాధి హావిూ పథకాన్ని అనుసంధానం చేసి మినీ గోకులంలు ఏర్పాటు చేశామని చెప్పారు.
కనీసం గొర్రెల పెంపకం కోసం తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీతో షెడ్ల నిర్మాణం కోసం రుణాలు అందించి గొర్రెల ఫామ్ నిర్వహణకు సహకారం అందిస్తామని హావిూ ఇచ్చారు.
మందులు, ఫీడ్ అన్ని తక్కువ ధరకు అందించి గొర్రెల పెంపకంలో రైతులకి లాభం వచ్చేలా చేస్తాం అంటూ లోకేశ్ ధైర్యం చెప్పారు.