Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పరిగి గులాబీలో గందరగోళం

నేతలకు బుజ్జగింపుల తలనొప్పి

పరిగి, ఫిబ్రవరి 20 (నిజం న్యూస్)

వికారాబాద్‌ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో వర్గపోరు ద్వితీయ శ్రేణి నాయకులకు చికాకు తెప్పిస్తోంది. కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో పరిస్థితి ఆగమాగం.. అయోమయం అన్న చందంగా మారింది. పాలక పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ నిప్పు రాజుకుంటున్నాయి. పరిగి ఎమ్మెల్యేగా మహేశ్‌రెడ్డి కొనసాగుతుండగా ఆయనను కాదంటూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసేందుకు ప్లాట్‌ ఫాం సిద్ధం చేసుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో వర్గ రాజకీయాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఎమ్మెల్యేగా మహేశ్‌రెడ్డికి పోటీగా డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానంటూ అన్ని మండలాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను సంసిద్ధం చేసుకుంటున్నారు. మనోహర్‌రెడ్డి తన కోటరీని తయారు చేసుకుంటున్నారు. దీంతో పరిగిలో బీఆర్‌ఎ్‌సలో కేఎంఆర్‌ వర్సెస్‌ బీఎంఆర్‌ వర్గాలుగా రాజకీయానికి తెరలేచింది. తాజాగా గత శనివారం పరిగి మండలం గడిసింగాపూర్‌లో మనోహర్‌రెడ్డి తన గ్రూపు ముఖ్యులతో సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే పదవికి పోటీలో తానూ ఉన్నాననే సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీలు, సర్పంచ్‌లు, పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు తాము ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారు.

ఎక్కడికక్కడ గ్రూపులుగా నాయకులు

ఎమ్మెల్యే గ్రూపు నుంచి డీసీసీబీ చైర్మన్‌ గ్రూపునకు.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు అన్నట్టుగా గోడ దూకుడు వ్యవహారంగా నాయకులు పరిస్థితి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు తమ గ్రూపు నుంచి వెళ్లకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు బుజ్జగిస్తున్నారు. భవిష్యత్తు మనదే అంటూ భరోసా ఇస్తున్నారు. గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోతూ మాట్లడుకోలేనంత పరిస్థితికి వెళ్లారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. బీఎంఆర్‌ ఫౌండేషన్‌తో మనోహర్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండు వర్గాల మధ్య కొందరు నాయకులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఎవరి వైపు పోతే ఏమవుతుందోనని ద్వితీయ శ్రేణి నాయకులు ఊగిసలాడుతున్నారు.

అంతర్గతంగా ఏం మాట్లాడుకుంటున్నారు?

ఒకే పార్టీలో ఇద్దరు నేతలు గ్రూపులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండలాలు, గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సఖ్యత లేకుండా పోయింది. పరిగి మండలం మాదారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకే దిగారు. ఉమ్మడి కులకచర్ల మండలంలో పార్టీ అధ్యక్షుడిని బుజ్జగించి తమ వైపు తిప్పుకున్నారు. దోమ మండలంలోని ఓ సర్పంచ్‌ని, పరిగి మండలంలోని ముగ్గురి సర్పంచ్‌లనూ ఎమ్మెల్యే వర్గం బుజ్జగించింది. చౌడాపూర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇద్దరి నేతల వర్గాలు ఆరోపణలు సంధించుకున్నాయి. గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాల్లోని ఇద్దరు సర్పంచ్‌లు ఆటా ఇటా అన్న సందిగ్ధంలో ఉన్నారు. దోమ మండలం బొంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిని తొలగింపుతో అక్కడ రెండు గ్రూపులు తయారయ్యాయి. దోమ మండల పరిషత్‌ పాలకవర్గంలో లుకలుకలు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ వైఎస్‌ ఎంపీపీ మల్లేశం, ఎంపీపీ కమారుడు రాఘవేందర్‌రెడ్డిల మధ్య సఖ్యత లోపించింది.

ఒకరిపై ఒకరు..

పరిగిలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే వర్గంపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఆయన బీఎంఆర్‌ గ్రూపులో ఉన్నారు. అధికారి అయిన ఓ ప్రజాప్రతినిధి భర్త బీఎంఆర్‌ ఫౌండేషన్‌ కార్యక్రమానికి వెళితే అధికారి ఎలా వెళ్తారని మరో ప్రజాప్రతినిధి బెదిరించినట్లు సమాచారం. కేఎంఆర్‌, బీఎంఆర్‌లు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వారు ఎవరికి వారే అన్నట్టు సంకేతాలు వెళ్తున్నాయి. వర్గ పోరుతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధిష్ఠానం జోక్యం చేసుకొని గ్రూపులు పార్టీకి నష్టం కలిగిస్తాయని ఇక్కడి నేతలకు నచ్చజెప్పాలని నాయకులు చర్చించుకుంటున్నారు.