బాసర త్రిబుల్ ఐటీ యూనివర్శిటీ లో విద్యార్థి ఆత్మహత్య

*అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి*
*రాత్రి వరకు రహస్యంగా దాచిన వైనం*
*సూసైడ్ నోట్ బయట పెట్టాలని విద్యార్థుల ఆందోళన*
ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో డిసెంబర్ 19 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో పియుసి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదివారం హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. గమనించిన తోటి విద్యార్థులు యూనివర్శిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో యూనివర్శిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి యూనివర్శిటీ పోలీసులు చేరుకొని మృత దేహాన్ని కిందికి దించి మృతుని జేబు నుండి లెటర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన విద్యార్థి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన భాను ప్రసాద్(17) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ మహేష్ పేర్కొన్నారు. విద్యార్థి ఆత్మహత్య మధ్యాహ్నం చేసుకుంటే రాత్రి వరకు బయట
పెట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో చనిపోయి ఉంటారని యూనివర్సిటీ అధికారిక వర్గాలు చెబుతున్న ఇధి కచ్చితంగా అధికారుల వైఫల్యమని భాజపా మోర్చా నాయకులు మండిపడ్డారు