హైదరాబాద్ అపోలో లో వైఎస్ షర్మిల

అక్రమ అరెస్టులను సహించేది లేదు. ఎమ్మెల్యే అవినీతిపై విమర్శించిన అందుకే కేసుల పర్వం.
వైయస్సార్ టి పి, అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆగ్రహం.
హైదరాబాద్ డిసెంబర్ 11 నిజం న్యూస్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండు రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లోటస్ పాండ్కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని అంతకుముందు షర్మిల తేల్చి చెప్పారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తమ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారానికి కూడా విడుదల చేయలేదని, పాత కేసులు తవ్వి వారిని రిమాండ్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తన పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి, అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేసే వరకు దీక్షను ఆపబోనని స్పష్టం చేశారు. కాగా, షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయలక్ష్మి కూడా దీక్షలో పల్గొన్నారు.