Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రతి మహిళ తమ ఆరోగ్యంతో పాటు ఆర్ధికాభివృద్ది చెందాలి….జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 23(నిజం న్యూస్)
ప్రతి మహిళ తమ ఆరోగ్యంతో పాటు ఆర్ధికాభివృద్ది చెందాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.బుధవారం నాడు బీబీనగర్ మండల సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య విజన్ బిల్డింగ్ నిర్వహణపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో బీబీనగర్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామం నుండి ముగ్గురు మహిళా గ్రామ సంఘాల సభ్యులు హాజరయ్యారు.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,బీబీనగర్ మండల సమాఖ్య రాష్ట్రంలో మోడల్ మండల సమాఖ్యగా ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాదులకు సంబంధించి ఐదు సంవత్సరాలలో సాకారం అయ్యేలా పని చేయాలని, అందుకుగాను కావాల్సిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి మహిళా తమ ఆరోగ్యంతో పాటు ఆర్ధికాభివృద్ది చెందాలని, అందుకు అనుగుణంగా వేరు వేరు రంగాలలో రాణించాలని, బ్యాంకులు అందించే ఋణ సౌకర్యాలతో తమ జీవనోపాధిని పెంచుకోవాలని అన్నారు. కోతుల బెడద ఉన్నపటికి జాగ్రత్త చర్యలు పాటించి కూరగాయలు పండించాలని సూచించారు.అంగన్ వాడిలలో నిర్వహించే కార్యక్రమాలను చూడాలని, స్కూల్ పిల్లలు సరిగ్గా స్కూలుకు వెళుతున్నారా,టీచర్స్ అందరూ వస్తున్నారా అనేది కమ్యూనిటీ బాధ్యతగా తీసుకోవాలని, గ్రామాలలో ప్రభుత్వపరంగా వచ్చే పథకాల అమలును గమనించాలని అన్నారు.ఓటర్ నమోదు కార్యక్రమంపై మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలని, అలాగే ఓటు హక్కు కలిగిన అందరూ ఆధార్ అనుసంధానం చేసుకునేలా చూడాలని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మండల ఉపేందర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ సభ్యులు సుధాకర్ గౌడ్,మండల అభివృద్ధి అధికారి శ్రీవాణి, మండల పంచాయతీ అధికారి స్వాతి, ఏ.పీ.ఎం.శ్రీనివాస్, గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు